Pawan Kalyan: కొండపైన దేవుడు వుండాలి.! క్రిమినల్ వుంటానంటే ఒప్పుకోం.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రలో భాగంగా గాజువాక నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ప్రతిసారీ జన సంద్రమే.. కొత్తగా చెప్పుకునేదేముంది.? కానీ, ఈసారి జన సునామీ.. అంతకు మించి కనిపించింది వారాహి విజయ యాత్రలో.
గాజువాకలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభకు ముందుగా, కొంతమేర రోడ్ షో తరహాలో వారాహి వాహనంపై జనసేనాని ముందుకు కదిలారు. అడుగడుగునా పెద్ద సంఖ్యలో జనం జనసేనానికి నీరాజనం పలికారు. మరీ ముఖ్యంగా మహిళలు అనూహ్యమైన రీతిలో ఈ యాత్రలో సందడి చేయడం గమనార్హం.
ఇక, గాజువాక బహిరంగ సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, స్థానిక సమస్యల్ని ప్రస్తావించారు. గాజువాకలో తాను ఓడిపోయాననీ, అయితే.. ఇక్కడి జనం తనను ఆదరిస్తున్న తీరు చూస్తోంటే, ఓడిపోయానని అనిపించడంలేదని జనసేనాని చెప్పుకొచ్చారు.
‘ఇది నా నియోజకవర్గం.. మన నియోజకవర్గం.. వచ్చే ఎన్నికల్లో జనసేన గెలిచి తీరాలి.. గెలిచి తీరుతుంది..’ అని నినదించారు జనసేనాని పవన్ కళ్యాణ్.
పార్లమెంటులో ఎంపీలు నినదించకపోతే, విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ ఎలా ఆగుతుందని ప్రశ్నించిన జనసేనాని, గెలిచినోళ్ళు కేసులకు భయపడి మాట్లాడకపోవడం వల్లే ఈ దుస్థితి అన్నారు. జనసేన పార్టీని గెలిపించండి, మూడేళ్ళలో విశాఖలో ఐటీ అభివృద్ధి ఎలా వుంటుందో చూపిస్తానని జనసేనాని, విశాఖ ప్రజలకు పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి పదవిలో కూర్చోడానికి సిద్ధంగా వున్నానని చెబుతూనే, ఆ పదవి రావాలంటే, అది ప్రజలు ఇవ్వాల్సి వుంటుందనీ, తన తొలి ప్రాధాన్యత వైఎస్ జగన్ని గద్దె దించడమేననీ, మెజార్టీ సీట్లు గెలిస్తే, జనసేన పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనీ, అప్పటి పరిస్థితులను బట్టి సంకీర్ణ ప్రభుత్వం గురించి ఆలోచన చేస్తామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
భూమిని మింగేయాలనుకునే హిరణ్యాక్షులు అప్పుడూ.. ఇప్పుడూ.. వున్నారన్న జనసేనాని, రుషికొండ విధ్వంసం చేస్తున్న జగన్, ప్రకృతి ప్రకోపిస్తే.. అత్యంత దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి రావొచ్చని హెచ్చరించారు.
‘ఈ భూమ్మీద ఎవరైనా వందేళ్ళకు మించి బతకలేం. అలాంటప్పుడు.. ఈ భూమిని మింగెయ్యాలన్న కోరికలెందుకు.?’ అని జనసేన అధినేత ప్రశ్నించారు. ‘కొండ మీద దేవుడు మాత్రమే వుండాలి.. క్రిమినల్ వుంటానంటే ఒప్పుకోం..’ అంటూ జనసేనాని తేల్చి చెప్పారు.
‘తిరుమల కొండపై వెంకటేశ్వరస్వామి దేవస్థానం.. బోల్డన్ని నిర్మాణాలున్నాయ్.. శ్రీశైలంలోనూ అంతే.. అలాంటప్పుడు, రుషికొండపై వైఎస్ జగన్ వుంటే తప్పేంటి.?’ అంటూ సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందిస్తూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని క్రిమినల్గా అభివర్ణించారు జనసేనాని.
విశాఖలో ఎంపీ కుటుంబం కిడ్నాప్కి గురయ్యిందనీ, అసలు విశాఖలో ప్రజలకు భద్రత ఎక్కడ వుందని పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను దోపిడీదారుగా అభిర్ణించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
The post Pawan Kalyan: కొండపైన దేవుడు వుండాలి.! క్రిమినల్ వుంటానంటే ఒప్పుకోం.! appeared first on TeluguBulletin.com.
TAGGED :