Chiranjeevi Helping Hand: ఫ్యాన్స్ కు చేయూత..! ఆపదలో ఉన్న అభిమానులను ఆదుకున్న చిరంజీవి
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.
చిరంజీవి.. ఈ పేరు తెరపై కనిపిస్తే.. అభిమానులతో ఈలలు వేయిస్తుంది. ప్రేక్షకులను మైమరిపిస్తుంది. అంతగా తన నటనతో దశాబ్దాలుగా అలరించారు కాబట్టే మెగాస్టార్ అయ్యారు. చిరంజీవిని అభిమానులు ఆరాధించే తీరే విభిన్నం. నేటి సోషల్ మీడియా యుగానికి అందని స్థాయి అది. అంతగా తనను అభిమానించిన తన అభిమానులను సేవా కార్యక్రమాల వైపు మళ్లించి వారికి మార్గదర్శి అయ్యారు. ఆపదలో ఉంటే ఆదుకుంటున్నారు. సందర్భోచితంగా సహాయం అందిస్తున్నారు. ఆ కోవలో ఆయన అభిమానులు కొందరు అనారోగ్యం బారిన పడితే ఇతోధిక సాయం చేసి తన ఉన్నత మనసు చాటుకున్నారు. చిరంజీవి చేసే ఎన్నో సేవా కార్యక్రమాలు బాహ్య ప్రపంచానికి తెలియనివి ఎన్నో ఉన్నాయని ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పిన సంగతి తెలిసిందే.
మెగా ఫ్యాన్స్ లో ఒకరైన విశాఖపట్నంకు చెందిన వెంకట్ కు చిరంజీవి అంటే వీరాభిమానం. చిరంజీవి కెరీర్ మొదలు నుంచి ఆయన్ను అభిమానిస్తూ.. సేవా కార్యక్రమాలు చేస్తూ.. చిరంజీవి ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. ఆమధ్య వెంకట్ క్యాన్సర్ బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న చిరంజీవి చలించిపోయారు. వెంకట్ ను విశాఖ నుంచి ఫ్లైట్ లో హైదరాబాద్ రప్పించారు. ఆయన ఇంట్లో ఆతిధ్యం ఇచ్చారు. చికిత్సకు ఏర్పాట్లు చేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2లక్షలు ఆర్ధికసాయం అందించారు. చికిత్స నిమిత్తం ఎటువంటి అవసరం ఉన్నా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
చిరంజీవి అంటే ఎనలేని అభిమానం చూపించే మరో మెగాభిమాని కృష్ణా జిల్లా పెడనకు చెందిన డి.చక్రధర్. చిరంజీవిని హీరోగా ఎంత అభిమానించారో.. చిరంజీవి ఆదర్శాలను కూడా అంతే విధిగా పాటించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అనారోగ్యంతో చక్రధర్ క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. చక్రధర్ అనారోగ్య విషయం తెలుసుకున్న చిరంజీవి చలించి ఆయన్ను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. చక్రధర్ ను హైదరాబాద్ రప్పించి ఒమెగా ఆసుపత్రిలో చికిత్సకు ఏర్పాట్లు చేశారు. డాక్టర్లతో స్వయంగా మాట్లాడారు. ఆసుపత్రికి వెళ్లి చక్రధర్ ను నేనున్నా.. అంటూ ధైర్యం చెప్పారు. చికిత్సకు అవసరమైన రూ.5లక్షలు బిల్లును చిరంజీవి చెల్లించి ఆయనకు ఊరటనిచ్చారు.