Chiranjeevi Helping Hand: పరిశ్రమ బిడ్డ చిరంజీవి..! కరోనా సమయంలో “CCC”తో సినీ కార్మికులకు నిత్యావసరాలు
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.
కరోనా విపత్తు సంభవించినప్పుడు ప్రపంచమే స్తంభించిపోయింది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అనివార్యమైంది. నిత్యావసరాలు, వైద్యం.. తప్పించి బయటకు వెళ్లలేని పరిస్థితి. అన్ని రంగాలు స్తంభించిపోయాయి. ఇందులో సినీ పరిశ్రమ కూడా ఉంది. రోజూ షూటింగ్ జరిగితే కానీ ఆరోజు వేతనం అందని కార్మికులు ఉన్నారు. వారికి ఇల్లు గడిచేది ఎలా..? ఇక్కడే చిరంజీవి పెద్దన్న పాత్ర పోషించారు. తనను ఇంతటివాడిని చేసిన సినీ పరిశ్రమ.. అదే పరిశ్రమలో కార్మికులు పస్తులు ఉండకూడదని భావించారు. మనిషికి మనిషే సాయం అందించాలనే భావన వెంటనే ఆయనతో అడుగులు వేయించింది. సినీ పరిశ్రమను సంఘటితం చేశారు. మనతోటి కార్మికులకు నిత్యావసరాలు అందిద్దాం.. వారి కుటుంబాలకు చేయూతనిద్దాం.. విరాళాలు అందించండని పిలుపునిచ్చారు. నెంబర్ వన్ హీరోగా, పరిశ్రమ బిడ్డగా చిరంజీవి కదిలారు.
ఇందులో భాగంగా కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ఏర్పాటు చేసి తనవంతుగా 2కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. తెలుగు సినీ హీరోహీరోయిన్లు, నిర్మాత, దర్శకులు, ప్రముఖులు అందరూ ముందుకొచ్చి తమవంతు విరాళం ప్రకటించారు. కర్నూలు నుంచి బియ్యం తెప్పించారు. సరుకులు తెప్పించారు. వాటిని ప్యాకింగ్ చేయాలి. కార్మికుల కుటుంబాలకు అందించాలి. అసలే కరోనా. ఎవరూ బయటకు రాని సమయం. అన్ని జాగ్రత్తలు తీసుకుని కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుని ప్యాకింగ్ చేయించారు. నాణ్యతలో లోపం లేకుండా నిత్యావసరాలు తెప్పించారు. వాటిని కార్మికుల ఇళ్లకు చేరవేసే కార్యక్రమం చేపట్టారు. ఇలా మొత్తం 3నెలలపాటు పరిశ్రమలోని కార్మికుల అందరి ఇళ్లకు నిత్యావసరాలు పంపించారు. సినిమా కోసం కష్టించే ఎందరో కార్మికుల బలం కావాలి. దీనిని గుర్తించి వారిని తామే ఆదుకోవాలన్న సంకల్పాన్ని కల్పించారు చిరంజీవి.
దేశంలోని మరే సినీ ఇండస్ట్రీలో ఓ హీరో ముందుకొచ్చి తన పరిశ్రమలోని కార్మికులకు చేయని సాయం ఇది. చిరంజీవి మాత్రమే పూనుకుని తెలుగు సినీ పరిశ్రమలోని కార్మికులకు చేసిన సాయం ఇది. సీసీసీ ఏర్పాటు చేసి చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ద్వారా కొందరు సినీ పెద్దల్ని కమిటీగా ఏర్పాటు చేసి ఎక్కడా ఎటువంటి లోపం లేకుండా, సరుకుల్లో నాణ్యత తగ్గకుండా, ఏ ఒక్క కార్మికుడికి సాయం అందలేదు అనిపించకుండా ప్రతిఒక్కరికీ నిత్యావసరాలు అందేలా 3నెలలపాటు అందించారు. దర్శకుడు మెహర్ రమేశ్ కూడా క్షేత్రస్థాయిలో ఉండి వీటి పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నారు. ఇలా అందరి సాయంతో ఎక్కడా మాట రాకుండా ఆపద సమయంలో కార్మికులను ఆదుకున్నారు చిరంజీవి.. కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఇంత చేసినా తాను పరిశ్రమ పెద్దను కాదు.. పరిశ్రమ బిడ్డను అని చెప్పి నిజంగా సినీ కళామతల్లికి సేవ చేశారు చిరంజీవి.