పోసాని కృష్ణ మురళి హత్యకు కుట్ర.? నవ్విపోదురుగాక.!
సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి, ప్రస్తుతం వైసీపీలో వున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆయన పోటీ చేశారు. అంతకు ముందు తెలుగుదేశం పార్టీకి మద్దతుదారు. కొన్నాళ్ళు జనసేన మద్దతుదారుడిగానూ పనిచేశాడాయన.
మాట విషయంలో ‘మెంటల్ కృష్ణ’ అనే పేరుని పదిల పరుచుకున్నాడు పోసాని కృష్ణమురళి రాజకీయాల్లో. ఆ కారణంగానే, వైసీపీ ఆయనకు ఈ మధ్యనే ఓ పదవి కూడా కట్టబెట్టిందనుకోండి.. అది వేరే సంగతి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీద అభ్యంతరకర ఆరోపణలు చేశారన్న కారణంగా ఆయనపై పరువు నష్టం దావా కేసు నడుస్తోంది. జనసేన నేత ఒకరి మీద కూడా ఇదే తరహా కేసు వేశారు నారా లోకేష్.
సరే, రాజకీయాలన్నాక ఇలాంటివన్నీ మామూలే. పరువు నష్టం దావా కేసులంటే, న్యాయస్థానాల సమయాన్ని వృధా చేయడం తప్ప ఇంకోటి కాదన్నది చాలాకాలంగా వినిపిస్తున్న వాదన. ఆ విషయం పోసాని కృష్ణ మురళికీ బాగా తెలుసు. అనూహ్యంగా ఆయన నిన్న మీడియా ముందుకొచ్చారు. తనకు ప్రాణ హాని.. అంటూ వాపోయారు.
కోర్టు విచారణకు వస్తే, తనను చంపేందుకు నారా లోకేష్ నియమించిన ముఠా పని చేస్తోందన్నది పోసాని కృష్ణ మురళి ఆరోపణ. గతంలో పోసాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత అభ్యంతకరమైన మాటలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పిల్లలపైనా జుగుప్సాకర వ్యాఖ్యలు చేశాడాయన.
నోరు అదుపులో పెట్టుకోరు సరికదా, ఇదిగో ఇలా ‘ప్రాణ హాని’ అంటూ మీడియాకెక్కుతుంటారు పోసాని. పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ప్రాణ హాని.. అంటూ అప్పట్లో పబ్లిసిటీ స్టంట్లు చేసిన పోసాని, ఈసారి ఇంకో అడుగు ముందుకేసి, ‘తాను హత్యకు గురైతే నారా లోకేష్దే బాధ్యత..’ అంటూ ప్రకటించేశారు.
శవ రాజకీయాలు వైసీపీలో కొత్త కాదు. బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపేసి, టీడీపీ మీదకు నెట్టేసినట్లే.. పోసాని కృష్ణ మురళినీ తుదముట్టించేసి, టీడీపీ మీదకు ఆ నెపాన్ని నెట్టేయాలని చూస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ అనుమానిస్తోంది. ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుందోగానీ, పోసాని కృష్ణ మురళి మాత్రం రాజకీయాల్లో కమెడియన్ అయిపోయారు. బలిపశువు కూడా అవుతున్నారు.