తిరుమల కొండపై చిన్నారి బలి: ఎవరి బాధ్యత ఇది?!
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.
వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల టీటీడీ ఛైర్మన్గా నియమితులయ్యారు. కొద్ది రోజుల క్రితమే బాధ్యతలూ తీసుకున్నారు. ఇంతలోనే, ఓ చిన్నారి తిరుమల కొండపై క్రూర మృగం దాడిలో ప్రాణాలు కోల్పోయింది.
కాలి నడకన తిరుమల కొండపైకి బయల్దేరిన ఓ కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. ‘ఆ వెంకటేశ్వరస్వామి కేవలం బండ రాయి మాత్రమే..’ అంటూ మృతురాలి తల్లి కన్నీరుమున్నీరవుతోంది. ‘ఈ ఘటనలో భద్రతా వైఫల్యం ఏమీ లేదు..’ అంటూ టీటీడీ బుకాయింపు చర్యలకు దిగింది.
టీటీడీ.. తిరుమల తిరుపతి దేవస్థానం.! విజిలెన్స్.. సెక్యూరిటీ.. అబ్బో, చాలా హంగామా.! కానీ, టీటీడీ అంటే, రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రం.. అనే ఆరోపణలున్నాయి.
భక్తుల నుంచి ఎలా దోచుకోవాలి.? టిక్కెట్ల ధరలెలా పెంచాలి.? గదుల ధరలు పెంచి, ఎలా దోచుకోవాలి.? అన్న విషయాలనే పాలక మండలి పరిగణనలోకి తీసుకుంటుంది తప్ప, భక్తుల భద్రత, భక్తుల సెంటిమెంట్లను పట్టించుకోవడంలేదన్న విమర్శలు ఈనాటివి కావు.
తాజా ఘటన భూమన కరుణాకర్ రెడ్డి ఖాతాలో పడిపోయిందిగానీ, నిజానికి.. తిరుమలలో భద్రత విషయమై చాలా ఆరోపణలు వస్తున్నాయి. చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర క్రూర మృగాలు భక్తులపై దాడులు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయ్.
వాస్తవానికి, అవి వుంటున్న చోటకి మనం వెళుతున్నాం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. భక్తులు రాత్రి వేళ గుంపులుగా మాత్రమే, నడక యాత్ర చేయాలని అధికారులు సూచిస్తున్నారు కూడా. అయినాగానీ, భక్తుల భద్రతపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు తరచూ ఎందుకు వినిపిస్తున్నట్లు.?
నిండు ప్రాణం బలైపోయింది.! బాధ్యత ఎవరు తీసుకుంటారు.? ఈ ఘటనతో ‘వెంకన్న బండ రాయి’ అనే ప్రచారానికి తెరలేపింది ‘మెరుగైన సమాజం’ కోసం అని చెప్పుకునే ఓ న్యూస్ ఛానల్.! పైగా, అధికార పార్టీ పెంపుడు మీడియా అది.!