కర్ర పెత్తనం.! తిరుమలకు భక్తులు తగ్గారట.! నిజమేనా.?
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.
వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ అయ్యాక, ‘ఊత కర్ర లేదా చేతి కర్ర’ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ‘వైసీపీ’ ఆశించిన ఫలితాల్నే ఇస్తున్నట్టుంది.
ఔను, నడక దారిలో భక్తులు నియంత్రించబడ్డారు. అను నిత్యం 30 నుంచి 45 వేల మంది వరకు శ్రీవారి భక్తులు నడక మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. అలిపిరి, మెట్టు మార్గాల్లో భక్తులు తిరుపతి నుంచి తిరుమలకు చేరుకుని శ్రీవార్ని సందర్శించుకుంటారన్న సంగతి తెలిసిందే.
అయితే, తిరుమల గిరుల్లో చిరుతల సంచారం నేపథ్యంలో నడక దారి భక్తులపై ఆంక్షలు విధించింది ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి.
మొన్నీమధ్యనే చిరుతపులి ఓ చిన్నారిని నడక మార్గంలో బలి తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో, తగిన భద్రతా చర్యలు చేపట్టాల్సిన టీటీటీడీ, ఊత కర్ర – చేతికర్ర పథకాన్ని తెరపైకి తెచ్చింది. దాంతోపాటు, నడక మార్గానికి సంబంధించి కొన్ని ఆంక్షలూ విధించింది.
ఫలితంగా నడక మార్గంలో తిరుమలకు చేరుకునే భక్తుల సంఖ్య పదిహేను వేలకు పడిపోయింది. ‘ఈ పద్ధతేం బాగాలేదు..’ అంటూ భక్తులు, టీటీడీ మీద మండిపడుతున్నారు. కాలి మార్గంలో సరైన భద్రతా చర్యలు చేపట్టాల్సింది పోయి, ఆంక్షలు విధించడమేంటన్నది భక్తుల ఆవేదన.
‘దేవుడ్ని భక్తులకు దూరం చేస్తున్నారు. హిందువుల నమ్మకాల్ని దెబ్బ కొడుతున్నారు. కాలి నడకన వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు.. వివిధ రకాల ఆలోచనలతో మొక్కులు మొక్కుకుంటారు. అలాంటివారిని టీటీడీ నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది..’ అన్నది భక్తుల ఆరోపణగా కనిపిస్తోంది.
ఇంకోపక్క ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ పంట పండుతోంది ఈ నిర్ణయం కారణంగా. కాలి నడకన వెళ్ళాలనుకునే భక్తులూ ఇప్పుడు వాహనాల్ని ఆశ్రయించక తప్పడంలేదు.